నితిన్‌ ‘పవర్‌ పేట’

ప్రస్తుతం మూడు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు నితిన్‌. తాజాగా మరో సినిమాను అంగీకరించారాయన. నితిన్‌ కథానాయకుడిగా పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ సంస్థ 'పవర్‌ పేట' పేరుతో ఓ చిత్రాన్ని నిర్మించనున్నది. కృష్ణచైతన్య ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. 2020 వేసవిలో ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభంకానున్నది. ఆసక్తికర కథ, కథనాలతో రూపొందనున్న ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని విశేషాల్ని త్వరలో వెల్లడించనున్నట్లు చిత్రబృందం పేర్కొన్నది. ప్రస్తుతం నితిన్‌..వెంకీ కుడుముల దర్శకత్వంలో 'భీష్మ', చంద్రశేఖర్‌ యేలేటి 'చదరంగం', వెంకీ అట్లూరి 'రంగ్‌ దే' సినిమాల్లో నటిస్తున్నారు. అవి పూర్తయిన తర్వాత 'పవర్‌పేట' షూటింగ్‌లో నితిన్‌ పాల్గొననున్నారు.